ఉర్దూ సాహిత్య ప్రపంచపు మహారాణిగా పేరు సంపాదించుకున్న డాక్టర్ రషీద్ జహాన్ భారతీయ ప్రగతిశీల రచయిత్రి , అనువాదకురాలు, మేధావి, కమ్యూనిస్టు నాయకురాలు, సాంస్కృతిక కార్యకర్త, ప్రజా వైద్యురాలు. తన తోటి సాహిత్య కారుల వల్ల, మత ఛాందసవాదం వలన, బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వాల అణచివేతకు- విస్మృతికి గురైంది. ఆమె రాసిన చాలా కాలానికి కానీ, ఆమె రచనలు పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు. అభ్యుదయ రచయిత్రి గానే కాదు. తొలితరం కమ్యూనిస్టుగా, డాక్టర్ గా, అదీ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలిగా( గైనకాలజిస్ట్) కూడా ఆమె ప్రతిభ, సేవానిరతి కొనియాడదగింది.
ఆమె కుటుంబ నేపథ్యం చూస్తే ఆ రోజుల్లో కూడా ముస్లిం కుటుంబాల్లో, ఇంత ప్రగతిశీల భావజాలం ఉన్నవాళ్లు ఉన్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది. డాక్టర్ రషీద్ జహాన్ రచనలు చేసిన రచనా కాలం 1920 నుంచి 1952. అంటే 90 ఏళ్ల క్రితం రాసిన కథలు ఇవి. ఈ కథలు అప్పటి సామాజిక చరిత్రని, రాజకీయాలని మన ముందు ఉంచుతాయి. తన చుట్టూ వెలుపల ఉండే స్త్రీల, ముస్లిం మైనారిటీల, శ్రామిక ప్రజల సమస్యలను మార్క్సిస్ట్ దృక్పథంతో డాక్టర్ రషీద్ జహన్ విశ్లేషించి కథలుగా రాశారు. భారత దేశ విభజన పూర్వకాలం నాటి సామాజిక జీవన చిత్రణ, బ్రిటిష్ సామ్రాజ్యవాదం, అసమ సమాజం, శ్రామిక వర్గ ప్రజల కష్టాలు, ముస్లిం స్త్రీల సమస్యలు- లైంగిక హక్కులు, విద్యా హక్కులు, ముస్లిం చాందసవాదం వంటి సామాజిక అంశాలను డాక్టర్ రషీద్ జహాన్ చాలా సూక్ష్మంగా పరిశీలించారు. వాటినే కథలు, నాటకాలుగా రాశారు. కథలతో పాటు ‘పర్దేకే పీచే” ఔరత్ అవుర్ మర్ద్’ లాంటి నాటకాల ద్వారా కూడా సంచలనాన్ని సృష్టించారు .
వీరు రచించిన ‘అంగారే’ కథల పుస్తకం సామాజిక , ద్వంద్వ ప్రమాణాలని, పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీల అణచివేతలని ఎదిరించే స్త్రీ పాత్రల్ని ప్రతిబింబించే కథలు ఇవి. ఈ పుస్తకం ఇండియన్ ఇస్లామిక్ కమ్యూనిటీలో పెద్ద దుమారం రేపింది. ముస్లిం సమాజపు మనోభావాలను గాయపరిచిన రచనగా పేర్కొని, పుస్తకాలను ప్రచురించిన ఉర్దూ ప్రెస్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. 1933లో బ్రిటిష్ వలస ప్రభుత్వం ఈ పుస్తకాన్ని మత స్వేచ్ఛను ఉల్లంఘించిన పుస్తకంగా నిషేధించింది.
డాక్టర్ రషీద్ జహన్ జీవితం -రచనల పట్ల ఆకర్షితురాలైన డాక్టర్ గీతాంజలి ఆమె రచనలు కొన్నింటిని వెలికి తీసి, వాటిని తెలుగులోకి అనువదించి ఇలా పుస్తక రూపంలో అందజేస్తున్నారు. వారి కృషి ప్రశంసనీయం. అనువాదం కూడా చాలా బాగుంది.
(“ఆమె కాలిపోయింది” మరికొన్ని కథలు. డాక్టర్ రషీద్ జహాన్. అనువాదం: గీతాంజలి. ఎన్నెల పిట్ట పబ్లికేషన్స్., హైదరాబాద్. వెల 150 రూపాయలు, పేజీలు 142. ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు మరియు 7989546568)

